నిజామాబాద్ జిల్లా : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్గిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర లోపు వ్యవసాయ భూములతోపాటు ఆస్తుల రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ కోసం స్ధలాన్ని పరిశీలించారు. అలాగే పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పదేపదే సూచించినా పనితీరులో మార్పు రాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపడుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా, పట్టణం, గ్రామం, గూడెం, తండా అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్లో ప్రయోగాత్మకంగా టవర్స్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలపై నిర్మాణ భారం తగ్గించడంతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 43వ డివిజన్లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
