క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు
ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 5.32 లక్షల ఇళ్లను 2027 నాటికి పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు . 2029 నాటికి ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. 2028 నాటికి ప్రతీ ఇంటికీ కుళాయితో మంచినీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు సీఎం. 9 లక్షల సోలార్ రూఫ్ టాప్ కింద ఇళ్లపై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అనుమతులిచ్చిన పరిశ్రమలకు త్వరితగతిన భూ కేటాయింపులు చేయాలన్నారు. పరిశ్రమలు, సేవలు వ్యవసాయ రంగంలో వృద్ధితో జీఎస్డీపీ పెరుగుతుందన్నారు .రాష్ట్రంలోనూ ఏఐ నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు. 6వ తరగతి నుంచే వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కింద శిక్షణ ఇస్తాం అన్నారు. డేటా లేక్ ద్వారా ప్రతీ ప్రభుత్వ శాఖనూ సమన్వయం చేస్తామని తెలిపారు. ఏఐ స్టాక్ లను ప్రతీ విభాగానికి అందుబాటులోకి తీసుకు వస్తాం అన్నారు. లీగల్ ఏఐ స్టాక్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. కన్విక్షన్ రేటును 70-80 శాతానికి తీసుకు రాగలిగితే తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు. జీరో క్రైమ్ విధానంతో పని చేయాలన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట కొందరు దుండగులు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం.
