పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం జిల్లా లోని రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందన్నారు. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి వెనుకబడిన ప్రాంతంగా ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు ఆ జిల్లానే సంపద కలిగిన ప్రాంతంగా మారి పోయింద‌ని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు.

విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుందని ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్ర మాజీమంత్రి దివంగత యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ సోలార్ వేఫర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో పెట్టుబడులు పెట్టి దాని కోసం ఆయన ఏపీని ఎంచుకున్నార‌ని తెలిపారు. అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగంగా ఉంటుంద‌న్నారు. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించిన‌ట్టేన‌ని చెప్పారు. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. గత పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!