హైదరాబాద్ : విదేశీ పర్యటనలో భాగంగా లండన్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందానికి కోలుకోలేని షాక్ తగిలింది. బ్రిటన్ నుంచి తిరిగి సీఎం అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు తన టూర్ ను కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి కేంద్రం యుఎస్ పర్యటనకు అభ్యంతరం తెలిపింది. కాగా తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ వంటి సంస్థలను సందర్శించి, అక్కడి వారితో సమావేశాలు నిర్వహించనున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో సీఎం బోస్టన్ లేదా న్యూయార్క్కు వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుండి నేరుగా హైదరాబాద్కు తిరిగి రానున్నారు. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించడం జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
అయితే అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించాలని అలాగే హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ , వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రేవంత్ వరంగల్ పర్యటన తర్వాత కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరిగింది. రేవంత్ రెడ్డి లండన్లో తన షెడ్యూల్ ప్రకారం సమావేశాలను కొనసాగిస్తారు. రాబోయే రెండు రోజుల్లో ఆయన లండన్లో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ (ఆక్స్బ్రిడ్జ్) , ఇతర ప్రముఖ బ్రిటిష్ విద్యాసంస్థల ప్రతినిధులు, క్రీడా సంస్థల నిర్వాహకులతో సమావేశమవుతారు. విధానం , ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యూకే ,అమెరికా పర్యటనల కోసం కేంద్రం అనుమతి కోరగా, కేవలం యూకే పర్యటనకు మాత్రమే ఆమోదం లభించింది. తెలంగాణ రైజింగ్’ ‘వికసిత్ భారత్’కు దోహదపడేలా సాగాల్సిన పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ… అమెరికాకు వెళ్లకుండా లండన్ నుండి నేరుగా హైదరాబాద్కు తిరిగి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
