ప్రపంచ స్థాయి ఆయుధ తయారీదారుగా భార‌త్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

ప‌శ్చిమ బెంగాల్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే కాలంలో భారత్ ప్రపంచ స్థాయి ఆయుధ తయారీదారుగా మారుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. భారత్‌లో తయారైన 3 యుద్ధనౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు పీఎం తో పాటు నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి. విదేశీ రక్షణ ఉత్పత్తులను కేవలం కొనుగోలు చేసే దేశంగా మాత్రమే మిగిలి పోవడం లేదా తన సైనిక శక్తిని ప్రపంచానికి ఒక “మార్కెట్”గా మార్చుకోవడం భారత్‌కు ఇష్టం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి రక్షణ పరికరాల తయారీదారుగా ఎదిగినప్పుడు దేశం నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఆయన ఉద్ఘాటించారు. తన రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా, రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ , ఇంజనీర్స్’ నిర్మించిన ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ యుద్ధనౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టే కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.

మోదీ మాట్లాడుతూ నేడు, రక్షణ రంగంలో భారత్ కేవలం కొనుగోలుదారుగా మాత్రమే మిగిలి పోవాలని కోరుకోవడం లేదన్నారు. మన సైనిక శక్తిని ప్రపంచానికి ఒక మార్కెట్‌గా పరిమితం చేయలేమని పేర్కొన్నారు.. మన శక్తికి సంబంధించిన‌ గుర్తింపు మార్కెట్‌గా ఉండటంలో లేదు, మన స్వయం సమృద్ధిలోనే ఉంద‌ని చెప్పారు మోదీ. భారత్ ఒక తయారీదారుగా ఎదగాలని కోరుకుంటోంద‌ని అన్నారు. మనం తయారీదారులుగా మారిన రోజున, నిర్ణయాత్మక శక్తిగా కూడా మారుతామన్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. మనం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాము” అని అన్నారు. 2014 తర్వాత భారత్ మొత్తం రక్షణ ఉత్పత్తి దాదాపు రూ. 40,000 కోట్ల నుండి రూ. 1.8 లక్షల కోట్లకు పెరిగిందని, రక్షణ ఎగుమతులు రూ.700 కోట్ల నుండి రూ.40,000 కోట్లకు పెరిగాయని, ప్రస్తుతం 80కి పైగా దేశాలు భారతీయ రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!