ముంబై : భారతీయ సినీ వినీలాకాశంలో విషాదం చోటు చేసుకుంది. తన గాన మాధుర్యంతో కోట్లాది మందిని ప్రభావితం చేసిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరి ఆశా భోస్లే ఆదివారం ముంబైలో కన్నుమూశారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆ గాయనిని శనివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. తన వయసు 92 ఏళ్లు. ఆధునిక భారతీయ సంగీతంలో గొప్ప గాయకులలో ఒకరిగా పేరుపొందారు. భోస్లే కుమారుడు ఆనంద్ ఆదివారం మధ్యాహ్నం ఈ వార్తను ధృవీకరించారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
భారతీయ సినిమా రంగంలో అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన, అనేక పాటలు పాడిన గాయకులలో ఒకరు. హిందీ చిత్ర సంగీతంలో ఉన్న స్థాయికి ఆమె అక్క, దివంగత లతా మంగేష్కర్ మాత్రమే సాటి. 1933లో సంగీత నేపథ్యం ఉన్న మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా, 9 సంవత్సరాల వయస్సులోనే వృత్తిపరంగా గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1943లో తన మొదటి సినిమా పాటను రికార్డ్ చేశారు . 50వ దశకం నాటికి బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాతి మూడు దశాబ్దాల పాటు, ఆమె చాలా మంది సంగీత దర్శకులకు అత్యంత ఇష్టమైన గాయనీమణులలో ఒకరిగా నిలిచారు.
ప్రారంభంలో, ఆమె కేవలం క్యాబరే నంబర్లు లేదా నేటి కాలంలో ఐటమ్ సాంగ్స్ అని పిలవబడే నృత్య గీతాలు పాడటానికే పరిమితమైనప్పటికీ, ఆశా తన గాన శైలిని మార్చుకుని, ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలో గజల్స్ను కూడా అత్యద్భుతంగా ఆలపించారు. ఆమె ఏడుసార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును, అలాగే ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలోని ‘దిల్ చీజ్ క్యా హై’ ‘ఇజాజత్’ చిత్రంలోని ‘మేరా కుచ్ సామాన్’ పాటలకు రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.
