విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై భగ్గుమన్నారు. తనను ఓ ఫిడేల్ చక్రవర్తి గా అభివర్ణించారు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లుంది మోడీ తీరు అని మండిపడ్డారు. దేశంలో ఆర్ధిక తుఫాన్ రాబోతుంటే ఇటలీలో చాక్లెట్లు పంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాటకం మీదున్న పిచ్చి ప్రధానికి నాయకత్వం మీద లేదని ఆరోపించారు షర్మిలా రెడ్డి. రీల్స్ చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ మోదీజీకి ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడంపై లేదన్నారు. అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాఫీలు పంచేందుకున్న ఆసక్తి, 140 కోట్ల మంది భారతీయులకు భరోసా ఇవ్వడంపై లేదన్నారు.
మోడీ మెలోడీ ఈ దశాబ్దపు అత్యుత్తమ కామెడీ అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. మోదీజీ చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు అని పేర్కొన్నారు. ప్రధాని చేసిన పనికి మాలిన పనులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఒక వైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచారన్నారు. సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇంకోపక్క రూపాయి విలువ దిగజారిందని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో మోడీజి మెలోడీ చాక్లెట్లు పంచుకుని తింటారా? అని ఫైర్ అయ్యారు. ఏం పొడిచారని ? ఏమి సాధించారని ? నిలదీశారు. నిరుద్యోగం, పేదలు, మధ్యతరగతి బతుకులకు చీకటి రోజులుగా మారాయన్నారు.