ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలి

విజ్ఞ‌ప్తి చేసిన తెలంగాణ మంత్రివ‌ర్గం

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన కార్మికులు త‌మ స‌మ్మెను విర‌మించాల‌ని కోరింది. తాము స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. మ‌రో వైపు త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు త‌గ్గేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ నేత‌లు. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియ జేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జ‌రిగింది. ప్ర‌ధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం ప్ర‌స్తావించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్ట లేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగ బద్ధమని కూడా అభిప్రాయ పడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు.

ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ప్రయోజనాలను అందించే అంశంపైన చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు.

అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. గచ్చీబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియంకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది.

Leave A Reply

Your Email Id will not be published!