చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గంగపుత్రులకు అండగా నిలిచారు. తాజాగా శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన తమిళనాడు మత్స్యకారుల విడుదల కోసం, అలాగే స్వాధీనం చేసుకున్న వారి చేపల పడవలను తిరిగి పొందడం కోసం తక్షణ దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయ్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు. తన లేఖలో రామనాథపురం జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారులను ఇటీవల శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వారిని వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి రప్పించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ప్రస్తుతం 54 మంది తమిళనాడు మత్స్యకారులు శ్రీలంక జైళ్లలో ఉన్నారని, 264 చేపల పడవలు శ్రీలంక అదుపులోనే ఉన్నాయని కూడా ఆయన హైలైట్ చేశారు. తమిళనాడు మత్స్యకారుల హక్కులు, జీవనోపాధిని పరిరక్షించేందుకు దౌత్య మార్గాల ద్వారా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఈ సందర్బంగా సీఎం తీసుకున్న చొరవ పట్ల గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో విజయ్ స్థాపించిన పార్టీ భారీ మెజారిటీని సాధించింది. ఏకంగా 234 సీట్లకు గాను 108 సీట్లు గెలుపొందింది. కేవలం పార్టీ స్థాపించిన 2 సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన వచ్చీ రావడంతోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు. మద్యం దుకాణాలు ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, దేవాలయాలకు ఆమడ దూరంలో ఉండాలని ఆదేశించారు.