కలబురగి : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. శనివారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం, కొన్ని చోట్ల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. మరికొన్ని చోట్ల ఫలితాలు కొంత గందరగోళాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. అయితే, నా అంచనా ప్రకారం, తమిళనాడులో డీఎంకేకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందనే ఆశ నాకు ఉందన్నారు. ఈ విషయం గురించి నేను అక్కడ కూడా ప్రస్తావించానని తెలిపారు. అదే విధంగా, కేరళలో యుడీఎఫ్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ శ్రేణులు నాకు ఇప్పటికే ఈ విషయాన్ని తెలియ చేయడం జరిగిందన్నారు ఖర్గే.
అసోంలో, మాకు ఆశించినన్ని సీట్లు రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కానీ, ఆ పోల్స్ చూపిస్తున్న గణాంకాల కంటే మాకు ఎక్కువ సీట్లే లభిస్తాయనే నమ్మకం నాకు ఉందన్నారు ఏఐసీసీ చీఫ్. పుదుచ్చేరిలో కూడా తాము బీజేపీ, ఎన్ఆర్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటం చేశామన్నారు ఖర్గే. అక్కడ కూడా మాకు గెలుపుపై ఆశలు ఉన్నాయన్నారు. కానీ స్థూలంగా చెప్పాలంటే అక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉందని అన్నారు. కాబట్టి మరో రెండు రోజుల పాటు వేచి చూద్దాం అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అక్కడ పోటీ అత్యంత నువ్వా-నేనా అన్నట్లుగా (neck-to-neck) సాగుతోందని చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ మరోసారి దీదీ నేతృత్వంలోని టీఎంసీ తప్పకుండా గెలుపు సాధిస్తుందన్నారు.
