హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో మేం ఉన్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం రావడంలో వారి పాత్ర ఉందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో వాళ్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపడం పట్ల కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలు పంచుకోవడం మరిచి పోలేనని పేర్కొన్నారు సీఎం. ఆర్టీసీ మనుగడ, అభివృద్ధితో పాటు గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు కార్మిక నాయకులకు అభినందనలు తెలిపారు. కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందని కొనియాడారు.
గాజుల రామారంలో బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించాం అని తెలిపారు సీఎం. శంషాబాద్ లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మిస్తాం అని ప్రకటించారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రో తో అనుసంధానం చేస్తున్నాం అని తెలిపారు. మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. డీజీల్ పైన ఆర్టీసీ ప్రతి ఏటా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఆదాయం పెంచుకోవడంతో పాటు ఖర్చు తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖర్చు తగ్గించు కోవడానికి ఈవీ బస్సులను తీసుకు రావాలని సూచించారు.
సంస్థ బకాయిలు మా హయాంలో పెట్టినవి కావు. కానీ, వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను మేం చెపట్టాం అని తెలిపారు సీఎం. యూనియన్లు, విలీనం వంటి అంశాలపైన ప్రణాళిక బద్దంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం చెప్పాలన్నారు. పీఆర్సీ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.మహాలక్ష్మీ పథకం పెట్టడం ద్వారా 8 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ఇచ్చాం అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పారు. ఈ సారి ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిలు విడుదల చేశాం అన్నారు.
