TS Private Universities Comment : ప్రైవేట్ వర్సిటీలు అవసరమా
ప్రభుత్వ యూనివర్శిటీలపై వివక్ష
TS Private Universities Comment : కేంద్రంలో మోదీ ప్రభుత్వం గంప గుత్తగా ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడితే తానేమీ తక్కువ తినలేదన్నట్టు తెలంగాణ సర్కార్ ప్రైవేట్ యూనివర్శిటీలకు పచ్చ జెండా ఊపింది.
విచిత్రం ఏమిటంటే విద్యా శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలను అందంగా వల్లె వేశారు. ప్రైవేట్ యూనివర్శిటీలు(TS Private Universities) వస్తే విద్యా రంగం మరింత అభివృద్ది చెందుతుందట.
ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండేందుకే వీటికి పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే అత్యంత పేరొందిన యూనివర్శిటీగా పేరొందింది ఉస్మానియా విశ్వ విద్యాలయం.
ఇక్కడ చదువుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సాధించారు. రాష్ట్రంలో కొలువు తీరిన యూనివర్శిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్
పోస్టులు వేలల్లో ఖాళీలు ఉన్నా భర్తీ చేసిన పాపాన పోలేదు.
మరో కొత్త ప్రతిపాదనకు తెర తీసింది సర్కార్. అన్ని యూనివర్శిటీలకు కలిపి ఉద్యోగాలను నింపుతామంటూ చిలుక పలుకులు పలుకుతోంది. దీనిపై
విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపినా పట్టించు కోవడం లేదు.
ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణలో ప్రైవేట్ యూనివర్శిటీలు కొలువు తీరాయి. తాజాగా అసెంబ్లీలో ఐదు ప్రైవేట్ యూనివర్శిటీలకు పచ్చ జెండా ఊపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు ఆమోదం పొందింది.
ఇంత తొందర ఎందుకన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఆయా యూనివర్శిటీలలో మౌలిక వసతులు కల్పించక పోవడం వల్ల అవి కునారిల్లుతున్నాయి.
కేవలం విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకే ప్రైవేట్ వర్శిటీలకు(TS Private Universities) అనుమతి ఇస్తున్నామని ప్రకటించడం
దారుణం. ఈ ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటు వల్ల ఎవరికి లాభం అనేది చెప్పడంలో విఫలమయ్యారు మంత్రి.
ఇక కొత్తగా పర్మిషన్ ఇచ్చిన యూనివర్శిటీలలో శామీర్ పేట లో నిక్ మర్ యూనివర్శిటీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ , సంగారెడ్డి లోని నర్సాపూర్ రోడ్డులో ఎంఎన్ఆర్ యూనివర్శిటీకి , ఇబ్రహ్రీంపట్నంలో గురునానక్ యూనివర్శిటీ, ఘట్ కేసర్ లోని యమ్నంపేట లోని శ్రీనిధి యూనివర్శిటీకి, గౌరారం, వర్గల్ లో కావేరి యూనివర్శిటీ ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇంత త్వరగా బిల్లును ఎందుకు తీసుకు వచ్చారనే దానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వలేక పోయింది ప్రభుత్వం. ఇప్పటికే కులాల వారీగా విద్యా సంస్థలను
విభజించుకుంటూ పోయిన వారికి ప్రైవేట్ యూనివర్శిటీల విషయంలో ఎందుకు అభ్యంతరం చెబుతారు.
మొత్తంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయింది. వీళ్ల సంస్థల్లో చదువుకున్న వాళ్లు రేపటి తరానికి ఎలా ఆదర్శంగా ఉండగలుగుతారో చెప్పాల్సింది ఏలుతున్న పాలకులే.
Also Read : లింగ వివక్ష నిజం ఉపాధికి దూరం