Bhatti Vikramarka : పాలన అస్తవ్యస్తం ప్రజలకు శాపం
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత భట్టి
Bhatti Vikramarka : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాద యాత్ర ప్రస్తుతం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం 90వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రజలతో మమేకమవుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు భట్టి విక్రమార్క.
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అప్పులు తప్ప అభివృద్ది అన్నది లేకుండా పోయిందన్నారు. విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ భారీ ఎత్తున ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేసిందని కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).
బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తోందని ఆరోపించారు. పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కేవలం తాము బాగు పడటానికే పాలన సాగిస్తున్నారంటూ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , రాబోయే రోజుల్లో కేసీఆర్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Google Bard AI : చాట్ జీపీటీతో గూగుల్ బార్డ్ ఏఐ ఢీ
