న్యూఢిల్లీ : అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై ఆందోళనకు శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పు కోవాలని బేషరతుగా తనపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సీజేపీ చేపట్టిన నిరసన దీక్ష మూడవ రోజుకు చేరింది. నీట్ పరీక్షలో అవకతవకలు . మే 3న జరిగిన పేపర్ లీక్ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను కొనసాగించింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ నిరసన దీక్ష రాత్రంతా కొనసాగింది.. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిరసనకారులు అక్కడే బస చేశారు. రాత్రంతా సాగిన ఈ ఆందోళనలో పాల్గొన్న వారికి కొందరు ఆహారం , తాగునీటిని పంపిణీ చేయడం కనిపించింది.
ఆదివారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, సోమవారం కూడా నిరసన కొనసాగుతుందని ప్రకటించారు.. ఈ ఉద్యమంలో చేరాలని రైతు సంఘాలు, ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసన స్థలం నినాదాలు, ప్రసంగాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తింది. మద్దతుదారులు చప్పట్లు కొడుతూ, డఫ్లీలు వాయిస్తూ దేశభక్తి గీతాలను ఆలపించారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, సాయంత్రం నాటికి అక్కడ 200 మందికి పైగా ప్రజలు గుమిగూడారు. పరీక్ష వివాదంలో జవాబుదారీతనం లోపించిందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దిప్కే డిమాండ్ చేశారు.
పేపర్ లీక్, పరీక్ష రద్దు తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా ఆయన కోరారు. నిరసన స్థలానికి ప్రజల రాకపోకలను అడ్డుకోవద్దని , బహిరంగ మరుగుదొడ్లకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని దిప్కే కోరారు. ప్రాథమిక సౌకర్యాలకు అంతరాయం కలిగిందని నిరసనకారులు ఆరోపించారు.
