Nepal Border : నేపాల్ బోర్డర్ లో సంచలనంగా మరీన ఉగ్రమూకల కదలికలు
నేపాల్కు చెందిన నగ్మా బానుని పెళ్లి చేసుకున్న సైఫుల్లా ఖలీద్....
Nepal Border : ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్.. ఉగ్రవాదాన్ని ఖతం చేసే పనిలో ఇండియా బిజీగానే ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో యాదృచ్ఛికంగా జరిగిందో.. లేక ఎవరైనా వ్యూహాత్మకంగా అడుగులు వేశారో కానీ.. పహల్గామ్ ఉగ్ర దాడి పాపానికి ఒడిగట్టిన లష్కరే తోయిబాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబూ సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్లో హతమయ్యాడు. అక్కడి సింధ్ ప్రావిన్స్లో సైఫుల్లా ఖలీద్ను కాల్చిచంపారు గుర్తు తెలియని వ్యక్తులు. భారత్లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఫేక్ ఐడీతో నేపాల్లో(Nepal) తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్.. ఇటీవలే సింధ్ ప్రావిన్స్కు మకాం మార్చాడు. పహల్గామ్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు సైఫుల్లా సహకరించినట్టు గుర్తించారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత..సైఫుల్లా ఖలీద్కు భద్రత కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఖలీద్ ఖతమయ్యాక, భారత్పై అతగాడు పన్నిన అతి పెద్ద కుట్ర విషయం వెలుగులోకి వచ్చింది.
Nepal Border Terrorist High Tension
నేపాల్కు(Nepal) చెందిన నగ్మా బానుని పెళ్లి చేసుకున్న సైఫుల్లా ఖలీద్.. ఆ దేశంలో వినోద్ కుమార్ అనే మారుపేరుతో కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇతగాడు కశ్మీర్లో ఉగ్రవాదం వ్యాప్తి కోసం చురుగ్గా పనిచేశాడు. నేపాల్లో కూడా ఓ టెర్రర్ గ్యాంగ్ను తయారు చేశాడు. నేపాల్లోని సిర్హా , సప్తరి, ధనుషా జిల్లాల్లో ఇస్లామియా జమాత్ పేరుతో శిబిరాలు నిర్వహించి, ఉగ్ర మూకలకు శిక్షణ ఇచ్చేవాడు సైఫుల్లా. ఆ టెర్రర్ మాడ్యూల్లో 37మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాళ్లలో 10 మంది పాకిస్తానీలు, 27 మంది బంగ్లాదేశీలు ఉన్నారని సమాచారం. వాళ్లంతా ఇప్పుడు..నేపాల్ సరిహద్దుల గుండా భారత్లోకి చొరబడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. నేపాల్ సరిహద్దుల్లో పెద్దఎత్తున మోహరించి సోదాలు జరుపుతున్నారు. ఆ దేశం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక నేపాల్-బిహార్ సరిహద్దులోని రక్సౌల్ సమీపంలోని వీర్గంజ్లో, ఖలిస్తానీ ఉగ్రవాది కశ్మీరీ సింగ్ను భద్రతా ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి.
ఈ నేపథ్యంలో భారత్, నేపాల్ సరిహద్దులో 20 కిలోమీటర్ల పరిధిలో సరిహద్దు దళాలు ముమ్మర తనిఖీలు ప్రారంభించాయి. ఇటీవల జరిగిన తనిఖీల్లో 20 మంది విదేశీ అనుమానితులు పట్టుబడగా, వీరిలో కొందరిని కెనడా, చైనా పౌరులుగా గుర్తించారు. నేపాల్ నుంచి పాక్, బంగ్లా-రోహింగ్యాలు, ఖలిస్తానీల ఉగ్ర మూకలు భారత్లో చొరబడకుండా భద్రతా దళాలు చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read : NITI Aayog : నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో 10వ నీతి ఆయోగ్ సమావేశం