KCR : ఎమ్మెల్యే ‘మాగంటి గోపీనాథ్’ భౌతికకాయాన్ని బోరున విలపించిన మాజీ సీఎం
గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు...
KCR : మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి విలపించారు. గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్కు(BRS) చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి(Maganti Gopinath) అకాల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ మృతి వార్త తెలియగానే ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి మాదాపూర్లోని మాగంటి నివాసానికి చేరుకున్న కేసీఆర్.. గోపినాథ్ను అలా చూసి కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు సహా.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు.
KCR Emotional
అంతకు ముందు.. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్(KCR) సంతాపం ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. మాగంటిని కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ ఈనెల 5న గుండెపోటుతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సీపీఆర్ చేయడంతో కాస్త కోలుకున్నారు. అంబులెన్స్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించే సమయంలో స్పృహ కోల్పోయారు. ఆసుపత్రి వర్గాలు మరోసారి సీపీఆర్ చేయడంతో పల్స్ రేటు పెరిగింది. దీంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కాగా, కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన సతీమణి శైలిమ గురువారమే ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా ఆమె ఆసుపత్రికి వెళ్లి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ కుమారుడు, మాగంటి కుమారుడు హైదరాబాద్లో కలిసి చదువుకోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య మైత్రి ఏర్పడింది.
Also Read : Rinku Singh-Priya Saroj: వైభవంగా క్రికెటర్ రింకు సింగ్ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్