Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !
ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !
Cyclone Montha : ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 6 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తోంది. పోర్ట్ బ్లేయర్ పశ్చిమ దిశకు 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశలో 780 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. కాగా, ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపాన్గా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఈ నెల 28వ తేదీ నాటికి తీవ్ర తుపాన్గా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం లేదా రాత్రికి కళింగపట్నం – మచిలీపట్నం మధ్య కాకినాడకి (Kakinada) సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నాడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల కురవనున్నాయి.
Cyclone Montha Updates
ఈ నేపథ్యంలోనే కాకినాడ (Kakinada), కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం నాడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిలాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావం నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
Cyclone Montha – మొంథా తుఫాన్ కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు
కోస్తా జిల్లాలను మొంథా (Montha) తుఫాన్ అతలాకుతలం చేయనుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని… మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Cyclone Montha – కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 112, 1070, 1800 425 0101
శ్రీకాకుళం: 08942-240557
విజయనగరం: 08922-236947
విశాఖపట్నం: 0891-2590102/100
అనకాపల్లి: 089242-22888
కాకినాడ: 0884-2356801
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: 08856-293104
పశ్చిమ గోదావరి: 08816-299181
కృష్ణ: 08672- 252572
బాపట్ల: 08643-220226
ప్రకాశం: 9849764896
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: 0861-2331261, 7995576699
తిరుపతి: 0877- 2236007
Also Read : Aadhaar Card: నో ఆధార్ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్కు ఆర్థికశాఖ ఆదేశాలు
