అమరావతి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు.
ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు మంత్రి ఎస్. సవిత. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇంతకు ముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు ఎస్ సవిత. దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
