తాడేపల్లి గూడెం : ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని అన్నారు, ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మావిగన్ కారిడార్లో కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు అన్న ఆయన, ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు, 110 కి.మీ మేర జాతీయ రహదారి ఉందని, దీంతో రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు, ఎన్ని దశాబ్ధాలు పడుతుందని ప్రశ్నించారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని, దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని, ఇంకా అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని నిలదీశారు. చంద్రబాబు తన పనులతో రాజధాని లేకుండా చేస్తున్నారన్న వైయ‹స్ జగన్, అందుకే ప్లాన్–బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు.
రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన పని లేదన్నారు బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా నా కన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఎన్నికలు అయిపోయి ఇవాళ రెండు సంవత్సరాలు అయి పోయింది. మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టాడు. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు మూడు బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశ పెట్టాడు. అంటే మిగిలి ఉన్నది కేవలం రెండే రెండు బడ్జెట్లు.
