చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి అక్షయ హరిహరన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈనెల 23న రాష్ట్రంలో 234 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఈ సందర్బంగా టీవీకే విజయ్, కమల్ హాసన్, శ్రుతి హాసన్, సూర్య, జ్యోతిక, వీటివి గణేష్ , మణిరత్నం, త్రిష కృష్ణన్, సుహాసిని, గౌతమి, తదితర ప్రముఖులు స్వయంగా వచ్చి ఓటు వేశారు. ఇదే సమయంలో తాను ఓటు వేసేందుకు వెళ్లింది నటి అక్షయ హరిహరన్. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తనకు కోలుకోలేని షాక్ తగిలింది. తన ఓటును అప్పటికే ఎవరో ఓటు వేశారని తెలిసి వాపోయింది. దీంతో అడయార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది నటి. తక్షణమే తన పేరుతో ఎవరు ఓటు వేశారో తేలాలని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
దీంతో తాజాగా అక్షయ హరిహరన్ సంచలనంగా మారారు. ఆమె ఓటు దుర్వినియోగం గురించి చేసిన వ్యాఖ్యలు కలకం రేపాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని కోరింది తను చేసిన ఫిర్యాదు పత్రంలో. ఈ సందర్బంగా అక్షయ హరిహరన్ మీడియాతో మాట్లాడారు. నేను చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, నా ఓటును వేరొకరు అప్పటికే వేసేశారు. ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగించింది అని పేర్కొంది. నేను తమిళనాడులోని వేలచ్చేరికి చెందినదాన్ని, నాకు నా ఓటు స్లిప్ రాలేదు. ఆ తర్వాత నా బూత్ అడయార్లో ఉందని ఆన్లైన్లో వివరాలు పంచుకున్నారు, అందుకే నేను అడయార్ వెళ్లి గంటసేపు వేచి ఉన్నాను. అప్పుడు నా ఓటును వేరొకరు అప్పటికే వేసేశారని నాకు చెప్పారు. అక్కడ 24 ఏళ్ల యువతిగా చెప్పుకుంటున్న ఒక మహిళ ఫోటో ఉంది, దానికి వారు వేలిముద్ర కూడా వేశారు. నా ఇంటిపేరు హరిహరన్, కాబట్టి పేపర్పై ఉన్నవన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ ఫోటోలు మాత్రమే వేరుగా ఉన్నాయి. కాబట్టి వారు ముందే తనిఖీ చేసి ఉండాల్సింది, ఎందుకంటే నా తరపున వేరొకరు ఎలా ఓటు వేయగలరని ప్రశ్నించింది నటి.
