బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : సవిత
సంచలన ప్రకటన చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి
తాడేపల్లి/అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీ అభ్యున్నతికి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారన్నారు. రాజ్యాధికారంలో, చట్టాల రూపకల్పనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. ఎందరో బీసీ రాజకీయ ఉద్దండులను టీడీపీ తీర్చిదిద్దిందన్నారు. అన్న స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు సవిత.
సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలన్నారు. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కల్పించడానికే బీసీ సాధికార సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశం ద్వారా ఆదరణ 3.0 పథకం అమలుపై సాధికార సమిత కన్వీనర్ల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గత రాక్షస ప్రభుత్వంపై బీసీ సాధికార సమితులు అలుపెరగని పోరాటం చేశారని మంత్రి సవిత కొనియాడారు. ప్రాణాలు పోతున్నా భుజాన పెట్టుకున్న పసుపు జెండాను దించ లేదన్నారు. బీసీ నేత తోట చంద్రయ్య, కాకినాడ జిల్లాలో లాలం బంగారయ్య తమ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదల్లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైసీపీ రాక్షస మూకలను చూసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత తెగువను మరిచి పోలేమన్నారు.
