ఆర్టీసీ ఉద్యోగుల‌కు యూబీఐ స‌హ‌కారంతో భ‌రోసా

ఉద్యోగులకు అండగా ఉంటామన్న ఎండీ వై. నాగిరెడ్డి

హైద‌రాబాద్ : రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్, పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఆపద సమయంలో యూబీఐ (యూనియన్ బ్యాంక్ ) సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కర కొచ్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ. కోటి అందజేస్తోంది.

ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఏం.రవీంద్రబాబు, రీజనల్ హెడ్ డి. వెంకటేశ్వర్లు లతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి బస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ వేరు వేరు సమయాలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో పికెట్ , పరిగి డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. తమ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు.

కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించు కోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించ కూడదని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. .ఈ కార్యక్రమంలో ఈడీ సిహెచ్.వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప , సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!