న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి స్థాయిలోనూ ముక్కలు ముక్కలుగా విడిపోవడం కాంగ్రెస్ పార్టీ నైజం అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డి.కె. శివకుమార్ , సిద్ధరామయ్యల మధ్య కొనసాగుతున్న పోరును మనం చూశాం; అంతకు ముందు రాజస్థాన్లో పైలట్-గెహ్లాట్ మధ్య సంఘర్షణను గమనించాం. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో రాహుల్ గాంధీ , ప్రియాంక వాద్రా మధ్య పరిస్థితులు ఇలాగే కనిపిస్తున్నాయని బాంబు పేల్చారు.
ఇప్పుడు గెహ్లాట్ చేసిన ఈ వ్యాఖ్య సచిన్ పైలట్పైనే కాకుండా, అంతకంటే ఎక్కువగా ఖర్గేపై చేసిన ప్రత్యక్ష దాడిలా ఉందన్నారు పూనావాలా. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆయన పేర్కొనడం ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. పార్టీ అధ్యక్షుడి ఎంపికకు వాస్తవ ఎన్నికలు జరగవన్నారు. నాయకత్వం అంతర్గతంగానే నిర్ణయించ బడుతుందని పేర్కొన్నారు. సోనియా గాంధీనే అధ్యక్షుడిని నియమిస్తారని స్వయంగా అశోక్ గెహ్లాట్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి అశోక్ గెహ్లాట్, ఖర్గే , సచిన్ పైలట్ల మధ్య సంఘర్షణగా మారిందన్నారు.
ఇక పదే పదే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా పేర్కొంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వీళ్లు ఎలా దేశాన్ని పాలిస్తారని నిలదీశారు. అందుకే జనం ఛీ కొట్టినా ఆ పార్టీకి బుద్ది రావడం లేదన్నారు. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, సుస్థిరమైన పాలనను అందించే సత్తా ఒక్క కమలం పార్టీకే ఉందన్నారు షెహజాద్ పూనావాలా.
