ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి పుష్పయాగ ఉత్సవం
భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన పుష్పయాగ వైభవం
తిరుపతి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. పుష్పాల పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తులు స్వామివారి దివ్యానుగ్రహాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేషంగా పూజలు సమర్పించారు.
అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరం, రోజా, తామర, కలువ, మొగలి రేకులు తదితర పది రకాల పుష్పాలు, మూడు రకాల పవిత్ర పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పుష్పాల అలంకారంతో శోభాయమానంగా దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు.
బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాలలో తెలిసీ తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, ఈ మహోత్సవం ద్వారా సమస్త దోషాలు నివృత్తి చెంది లోకక్షేమం, భక్తుల శ్రేయస్సు కలుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు. పుష్పయాగం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు మంగళద ర్శనం ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
