పారిశ్రామికవేత్తలు అవకాశాలు అంది పుచ్చుకోవాలి
సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు
సింగపూర్ : తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ,అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు ఉన్నారని, వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చచంద్రబాబు నాయుడు సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్తో భేటీ అయ్యారు. నేడు టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాలని అన్నారు. రాష్ట్రం తరుపున, దేశం తరుపున విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వాములను చేస్తాం అని వెల్లడించారు సీఎం. ఏపీలో ఉన్న అవకాశాలు విదేశాల్లో వివరించే బాధ్యతను కూడా పారిశ్రామిక వేత్తలు తీసుకోవాలని కోరారు .
పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం అంటే…సొంత రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడమేనని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మన బలాలు వివరించి విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు రావాలని అన్నారు. అవసరం అయితే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని సూచించారు. ఏపీలో మంచి పాలసీలు ఉన్నాయని, సహకరించే ప్రభుత్వం ఉందని చెప్పారు సీఎం. మానవ వనరులు, భూములు, నీళ్లు విస్తృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా ఏపీలో పెట్టబడులు పెట్టవచ్చు అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం.
ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు మనం బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను పారిశ్రామిక వేత్తలు తీసుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.
