సింగపూర్ : సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటికోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. దీనిని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిల్యాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాడ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకుంటోన్న శ్రద్ధ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని రచయిత శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ వివరించారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాధ్ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకంలో ఆవిష్కరించినట్టు తెలిపారు. సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణేన్ని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు.
త్వరలోనే ఈ పుస్తకం తెలుగు, హిందీ సహా వివిధ భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెలువడిన చంద్రబాబు X.0 పుస్తకం సాఫ్ట్ కాపీ 8 మిలియన్ల మేర డౌన్ లోడ్ అయ్యిందని తెలిపారు. ఈ పుస్తకంలో పొందుపరచిన అంశాలు రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేస్తున్న వారికి, మేనేజ్మెంట్ విద్య అభ్యసించే వారికి ఉపయుక్తంగా ఉందని నిర్వాహకులు వివరించారు.