అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవలను మెరుగు పరచడానికి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి చేయాల్సిందేనని అన్నారు. గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా యంత్రాంగంలో మరింత జవాబుదారీతనం, అప్రమత్తత అవసరమని నొక్కి చెప్పారు. పరిపాలనను బలోపేతం చేయడానికి , ప్రజా సేవలను మెరుగు పరచడానికి తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. సచివాలయంలోని ‘రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ’ ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఆయన పరిపాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం , అప్రమత్తత ఆవశ్యకతను స్పష్టం చేశారు. జూన్ నుండి క్షేత్రస్థాయి తనిఖీలను తప్పనిసరి చేయాలని ఆయన అధికారులకు సూచించారు; ఉన్నతాధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని అన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలు సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి , ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయ పడతాయని టీడీపీ అధినేత, సీఎం అభిప్రాయపడ్డారు. జూలై నుండి ప్రతి అధికారి క్షేత్రస్థాయిని సందర్శించాలని ,వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకే కేటాయించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని, అలాగే నియోజకవర్గ నోడల్ అధికారులు నెలకు నాలుగు సార్లు సంబంధిత మండలాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అధికారుల , ఉద్యోగుల పనితీరును సమగ్రమైన ‘360-డిగ్రీల అంచనా విధానం’ ద్వారా మూల్యాంకనం చేస్తారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. సింగపూర్ అనేక వినూత్న పాలనా నమూనాలను అవలంబించిందని నాయుడు గుర్తు చేశారు.