న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయినా కొన్ని నెలల పాటు పొడిగించింది. తాజాగా సీనియర్ ఐఏఎస్ లు చాలా మంది రేసులో ఉన్నప్పటికీ జాజు వైపే మొగ్గు చూపింది సర్కార్. సంజయ్ జాజు 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. తను ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయనను తిరిగి పంపించేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఆయన 26 ఫిబ్రవరి 1969లో పుట్టారు. వయసు 57 ఏళ్లు. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ, ఎంటెక్, కాస్ట్ , మేనేజ్మెంట్ అకౌంటెంట్ , ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. ఇ-గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ప్రొడక్షన్, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంలో అపారమైన అనుభవం ఉంది.
కెరీర్ పరంగా చూస్తే సంజయ్ జాజు 1995 నుంచి 2011 వరకు ఏపీలో పని చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ గా, విశాపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా , , ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ గా, ఎండీగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా పని చేశారు సంజయ్ జాజు. అంతే కాకుండా 2011 నుంచి 2014 వరకు ఇ గవర్నెన్స్ పయనీర్ కార్యదర్శిగా , ఐటీ కమ్యూనికేషన్ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో ఏపీ మీ సేవను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు . 350కి పైగా ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించే ఈ ప్రాజెక్టు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా మారింది. నేషనల్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డ్ 2014 అందుకుంది.
