అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ దేశానికి ‘ఒక వారం విరామం’ ఇచ్చామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో తాత్కాలికంగా శత్రుత్వాలను నిలిపివేసినట్లు తెలిపారు. తాము దయార్ద హృదయం కలిగిన వాళ్లమంటూ ప్రత్యేకంగా పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. దేశాల మధ్య యుద్ద వాతావరణాన్ని రెచ్చగొడుతూనే ఇంకో వైపు అనునయపు వ్యాఖ్యలు చేయడం దారుణమంటోంది ఇరాన్. ఇదే సమయంలో ఇరాన్పై తీవ్రమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ట్రంప్ . హతమైన ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఆ దేశానికి వెసులుబాటు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
మౌంట్ రష్మోర్ వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావించారు. అమెరికా ఒత్తిడి ఇరాన్ నాయకత్వం కు సంబంధించిన మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వారు తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆత్రుతగా ఉన్నారని అధ్యక్షుడు పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ కోసం ఇరాన్లో రోజుల తరబడి సాగే అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. వెనిజులాలో సాధించిన విజయాలను కూడా అధ్యక్షుడు ప్రస్తావించారు; తన పరిపాలన వేగవంతమైన చర్యల వల్ల ఆ లాటిన్ అమెరికా దేశంలో ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించామని చెప్పారు ట్రంప్ .
చరిత్రలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా నిర్మించిందనడానికి ఈ సంఘటనలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ విధానానికి అతీతంగా, అపూర్వమైన ఆర్థిక పునరుజ్జీవనం సాధించామని అధ్యక్షుడు గొప్పగా చెప్పుకున్నారు.
