దేశ నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాలి

పిలుపునిచ్చిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలందరి సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌లో ‘దేశ నిర్మాణంలో భాగస్వాములు’ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం దేశ నిర్మాణ ప్రక్రియకు దోహద పడేలా ఈ కార్యక్రమంలో ఉద్యోగులు , ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ‘వికసిత్ భారత్, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను సాకారం చేయడంలో ప్రతి ఉద్యోగి , అధికారి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గుంతలు లేని రోడ్లను నిర్ధారించే లక్ష్యంతో ‘రోడ్ డాక్టర్’ పేరుతో గుంతలు ఉన్న రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేయబడుతోందని, దీనిని రాష్ట్రమంతటా విస్తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు సీఎం. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి పనులలో భాగస్వాములవుతారని నాయుడు అన్నారు. వివిధ అంశాలపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన అధికారులను కోరారు. మెగా DSC-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు ‘ఆత్మగౌరవ ర్యాలీ’ ద్వారా ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఉదాహరణను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించిన ముఖ్యమంత్రి, దానివల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!