అమరావతి : పింగళి వెంకయ్య చౌదరి తయారు చేసిన జాతీయ పతాకం భారత దేశానికి ప్రతీక అని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి లో నిర్వహించిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భారతీయులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు. ఈ రోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం.ఈ జాతీయ జెండా మన కు లభించిన స్వేచ్ఛకు గుర్తింపు అని చెప్పారు. మన ఆత్మగౌరవానికి ప్రతిబింబం. మన ఐక్యతకు చిహ్నం. మన భవిష్యత్కు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మన స్వేచ్చ ఊరికే రాలేదన్నారు సీఎం. ఒక్కరోజులో రాలేదు. ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం. ఎన్నో తరాల ఉద్యమం. ఎందరో మహనీయుల బలిదానం. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం వల్లే మనకు విముక్తి లభించిందన్నారు.
మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు .తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం అని అన్నారు సీఎం. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అదే స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్లు మన కోసం పోరాడారు. త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చిందని అన్నారు.
