అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు అనుకూలంగా మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. వారి సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం మూడు ప్రధానమైన అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని అన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు సీఎం. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ఆయారాం గయారాం కాకుండా సుస్థిరమైన పాలన అందించేలా ఇది దోహద పడుతుందన్నారు
రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా ప్రజాపరిషత్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు సీఎం. గతంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు బీసీల రిజర్వేషన్లు కాపాడలేక పోయారని మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నిర్ణయం చరిత్రలో నిలిచి పోతుందన్నారు. 34 శాతం రిజర్వేషన్ అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం అన్నారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను, వ్యవసాయాన్ని, చేతివృత్తుల్ని నిలబెట్టింది బీసీ సమాజమేనని ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏ హామీతో పాటు మా కూటమి ప్రభుత్వ రాజకీయ సిద్ధాంతంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో చెప్పాం. ఇప్పుడు నిజం చేసి చూపామన్నారు సీఎం.
