చెన్నై : స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆత్మవిశ్వాసం ఉండాలని స్పష్టం చేశారు డీఎంకే ఎంపీ కనిమొళి. సమస్యలను గుర్తించి పరిష్కారాలను రూపొందించేందుకు కృషి చేయాలన్నారు. చెన్నై వేదికగా తూత్తుకుడి టు ది వరల్డ్’ పేరుతో జరిగిన సదస్సులో 1,000 మందికి పైగా యువ స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు. స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ‘ఆల్-ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ ‘వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ’ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడుతూ ఉద్భవిస్తున్న సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను అభివృద్ధి చేయడం, తమ ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచుకోవడం వంటి వాటిపై స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆత్మవిశ్వాసం ఉండాలని అన్నారు. స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడానికి , ప్రపంచ వ్యాపార వర్గాలకు తూత్తుకుడి సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి ఈ సదస్సు ఉద్దేశించ బడిందన్నారు.
.ప్రభుత్వ స్టార్టప్ కార్యక్రమాల కింద ఉన్న అవకాశాల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడం , మరింత మంది యువతను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యం అని పేర్కొన్నారు. వేగవంతమైన సాంకేతిక పురోగతి, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు విస్తరణ పరిశ్రమలను మారుస్తోందని, కొత్త సవాళ్లను సృష్టిస్తోందని అన్నారు. స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, అలాగే సమాజం, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఒక స్టార్టప్కు అత్యంత పెద్ద సవాలు ఏమిటంటే, అందరూ ఒక సమస్య గురించి చర్చించడం ప్రారంభించడానికి ముందే దానిని గుర్తించి, పరిష్కారాన్ని రూపొందించడం. పరిష్కారం దొరికిన తర్వాత, దానిని అమలు చేసే ఆత్మవిశ్వాసం ఉండాలి అని కనిమొళి అన్నారు. పెద్ద సంస్థలతో పోలిస్తే, చిన్న బృందాలు కలిగిన స్టార్టప్లు ప్రజల అవసరాలను వేగంగా అర్థం చేసుకుని, వాటికి తగినట్లుగా స్పందించగలవని ఆమె పేర్కొన్నారు.
