విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అబద్దాలకు కేరాఫ్ గా మారారని అన్నారు. ఆయనను జనం నమ్మడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలుగు పంచితే చంద్రబాబు వచ్చాక అన్నీ తాను చేశానంటూ చెప్పడం దారుణమన్నారు. ప్రాజెక్టు పనులు 82 శాతం తన తండ్రి హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు వచ్చాక కేవలం 10 శాతం పనులు పూర్తి చేసి అంతా తానే చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇవాళ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
3 దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ పూర్తి కావడం శుభ సూచకమేనని పేర్కొన్నారు. తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, త్రాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఎటొచ్చి ఇక్కడ మరొక్క సారి నిర్ద్వంద్వంగా స్మరించు కోవలసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆశయం, కృషిని అన్నారు. వెలిగొండకు వెలుగు ఆయనే. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం అన్నారు షర్మిలా రెడ్డి. కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, 23 లక్షల మందికి తాగు నీరు అందుతుందంటే దానికి కారణం వైఎస్సారేనని పేర్కొన్నారు.
సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5 న, బాబు గారు వేసింది కేవలం ఓ రాయి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా అడ్వైజరీ కమిటీల పేరుతో, DPR ల ముసుగులో 9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదన్నారు. శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదంటూ మండిపడ్డారు.
