ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టం
కీలక వ్యాఖ్యలు చేసిన విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం జిల్లా : తమ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనలకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్ట బోమంటూ ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ప్రేమ ఉదయం , ఏజ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా హరే కృష్ణ మూవ్మెంట్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్కు నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కిచెన్ను పరిశీలించారు. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాని భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఏవీనీ మంత్రి లోకేష్ తిలకించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి లోకేష్ ను నిర్వాహకులు సత్కరించారు.
అనంతరం ప్రేమ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్/స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్ , పాలియేటివ్ కేర్ సెంటర్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డోనర్ గ్యాలరీని సందర్శించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనంలోని 4వ అంతస్తు, 5వ అంతస్తును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం సంస్థకు సహకరిస్తున్న ముఖ్య దాతలతో బోర్డ్రూమ్ సమావేశంలో పాల్గొన్నారు. . దివంగత పద్మశ్రీ డాక్టర్ ఎస్.వి. ఆదినారాయణరావు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఒక వ్యక్తి చేసిన దానం నేడు అనేక మందికి ఉపయోగపడే మహావృక్షంగా మారిందని అన్నారు. ఆదినారాయణరావు కుటుంబం సమాజ సేవ కోసం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ భూమిలో కాలేజీ, హరేకృష్ణ మిషన్ ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమం, వృద్ధుల సంరక్షణ కేంద్రం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
