16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్లు కేటాయింపు

నాలుగు రోజుల పాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ

హైద‌రాబాద్ : అవుటర్ రింగ్ రోడు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో 7340 మంది కి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. హైద‌రాబాద్ నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన లాటరీ ప్రక్రియ ముగిసింది . రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 28 వ తేదీ నాడు లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మినహాయించి మిగిలిన 15 నియోజకవర్గాల్లో 480 ఇండ్ల చొప్పున కేటాయించారు. కంటోన్మెంట్ పరిథిలో తొలివిడతలో 140 ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నందున ఆ సంఖ్యలోనే ఇండ్లను కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికే ఇండ్లు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టి, హౌసింగ్ బోర్డు ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఇలా అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రతిపాదించిన మొత్తం 7340 ఇండ్లకు గాను 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో అర్హులైన వారి పేర్లతో పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షపాతం గా, బహిరంగంగా లాటరీ నిర్వహించి ఇండ్లను కేటాయించారు.

ఆగస్టు 28 వ తేదీ నుంచి 31 వరకు ఆయా నియోజకవర్గాల్లోనే దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ జరిగింది. లాటరీ నిర్వహణ ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో సంతృప్తి వ్యక్తం కాగా, లాటరీ ద్వారా ఇండ్లు పొందిన కుటుంబాల్లో పండుగ సీజన్ ను మరింత సంతోషాలను నింపింది. అవుటర్ రింగ్ రోడ్ పరిథిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తి కాగా, 4 నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడనున్నది .ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఇండ్లు పొందిన వారి వివరాలన్నిటినీ http://tghb.telangana.gov.in లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. ఇలా ఎంపికైన ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ అభ్యంతరాలను కూడా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే సమర్పించ వచ్చన్నారు. అలాగే , లాటరీలో ఎంపికైన దరఖాస్తు దారుల వివరాలను పరిశీలించడానికి అధికారుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనను చేపడుతుందని వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా, అర్హులైన వారికే ఇండ్లు లభించేలా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం దరఖాస్తు చేసుకుని, లాటరీ ప్రక్రియలో ఇండ్లు రాని వారు ఏమాత్రం నిరుత్సాహం చెందవద్దని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చేపడతామని, అందులో ఇండ్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!