అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆయన ప్రధానంగా ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. వృధాగా పోతున్న కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దానిని ప్రారంభించారు కూడా. ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని పోలవరం ఎడమ కాలువ జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ఎల్ఎంసీ ఫస్ట్ ఫేజ్కు నీటి విడుదల చేయడం చారిత్రాత్మకమన్నారు.
20–30 ఏళ్లుగా ఉత్తరాంధ్ర ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల నేటితో నెరవేరిందన్నారు. పోలవరం ఎల్ఎంసీ పనుల్లో రెండేళ్లలోనే కీలక పురోగతి సాధించాం అని చెప్పారు. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ నదులపై నుంచి దాటుకుంటూ ఎల్ఎంసీ ద్వారా గోదావరి జలాలు తరలి వస్తున్నాయని చెప్పారు.11 చోట్ల నేషనల్ హైవేలను క్రాస్ చేస్తూ ఎల్ఎంసీ పనులు పూర్తి చేశామన్నారు నిమ్మల రామానాయుడు. కుమ్మరిలోవ వద్ద క్లిష్టమైన భూసేకరణ సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు కుమ్మరిలోవలో 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ నిర్మాణం పూర్తి చేశామన్నారు. వేలాది నిర్మాణాలు, అనేక అవాంతరాలను అధిగమించి ఎల్ఎంసీ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2019–24 మధ్య ఎల్ఎంసీకి ఒక్క తట్ట మట్టి కూడా తీయ లేదన్నారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి పని కూడా గత ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు నిమ్మల రామానాయుడు . ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోలవరం ఎల్ఎంసీ జీవనాడిగా మారిందన్నారు. దీంతో విశాఖ నగరానికి తాగునీరు, స్టీల్ ప్లాంట్కు నీరు అందుతుందన్నారు. నీరు–పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రలో కొత్త అభివృద్ధి శకం మొదలైందన్నారు.
