కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 గేట్లను అధికారులు తెరిచారు. వరదనీరు పోటెత్తడంతో ప్రవాహాన్ని అంతా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆ నీటి ప్రవాహ ఉధృతిని డ్రోన్ కెమెరాతో తీసిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కరకట్ట దగ్గర ఉన్న 36 అక్రమకట్టడాలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉండటం విశేషం.
ఇన్ ఫ్లో 7లక్షల 50 వేల క్యూసెక్కులు ఉంటే అవుట్ ఫో 7 లక్షల 45 వేల క్యూసెక్కులు ఉంది. అధికారులు కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు సాగునీటి అవసరాల కోసం 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ప్రజలు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు తుఫాను షెల్టర్లను, పునరావాస కేంద్రాలను వెతికే పనిలో పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ సిబ్బంది తక్షణం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని శివారు, లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
