Ajit Pawar: చిక్కుల్లో అజిత్ పవార్ కుమారుడు
చిక్కుల్లో అజిత్ పవార్ కుమారుడు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్కు చెందిన కంపెనీ… పుణెలో భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి రెవెన్యూ అడిషనల్ చీఫ్ సెక్రటరీ వికాస్ ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. రూ.1,800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పార్థ్ పవార్కు చెందిన అమేడియా ఎంటర్ప్రైజెస్కు రూ.300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈ కేసులో భాగమైన తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిన రాష్ట్రప్రభుత్వం… తాజాగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పుణెలోని ముద్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల ‘మహర్ వతన్’ భూమిని, నిరభ్యంతర (ఎన్వోసీ) పత్రం లేకుండానే అమేడియా ఎంటర్ప్రైజెస్కు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అని, దాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అమ్మడానికి వీల్లేదని వివరించారు.
ఆశారాం బాపునకు ఆరునెలల బెయిల్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(84)నకు గుజరాత్ హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. 2013నాటి అత్యాచారం కేసులో జీవిత కారాగారం అనుభవిస్తున్న ఆయనకు వైద్య చికిత్స కోసం ఈ వెసులుబాటు కల్పించింది. వారం క్రితం రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన విధంగా ఆశారాంనకు అదే కారణంతో బెయిలిస్తున్నట్లు జస్టిస్ ఐలేశ్ ఓరా, జస్టిస్ ఆర్టీ వచ్ఛానీ తెలిపారు. రాజస్తాన్లోని ఆశ్రమంలో 2013లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అక్కడి హైకోర్టు కూడా ఆశారాంనకు జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆశారాంనకు అక్టోబర్ 29న ఆరు నెలల బెయిలిచ్చింది.
