అమరావతి : మాజీ మంత్రి విడుదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సర్కార్ పై. ప్రచారంపై ఉన్నంత శ్రద్ద పనిపై ఉండడం లేదన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఇదేనా..? అని ప్రశ్నించారు. పెన్షన్ల మంజూరులో కొత్త తరహా స్కిట్లు.. షూటింగ్లకే పరిమితమైన చంద్రబాబు పాలన అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు సరే కదా.. వైయస్సార్సీపీ సానుభూతిపరుల పెన్షన్లు 6 లక్షలు కట్ చేశారని ఆరోపించారు. మేనిఫెస్టోలో 50 ఏళ్లకు పెన్షన్ హామీ ఏమైంది? అని నిలదీశారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారంటు మండిపడ్డారు. రూ. 3.61 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది విలాసాలకా? స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్లకే ప్రజాధనం ఆవిరి అయ్యిందన్నారు. అమరావతి అద్దాలకే రూ. 2,500 కోట్లా? అడుగుకు రూ. 18,500 ఖర్చా? ఇది దోపిడీ కాదా? అని విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 4 వేల కోట్లు.. నెట్వర్క్ ఆసుపత్రులను తాకట్టు పెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలను గాలికొదిలేసి.. అమరావతిలో అవినీతికి వేల కోట్లు వెచ్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న ప్రేమ.. పేదల ఆరోగ్యం, విద్య మీద ఏదీ లేదన్నారు. ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ అంటారా? వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని మండిపడ్డారు. ఎన్టీఆర్, వంగవీటి రంగా మరణాల వెనుక అసలు కథ ఏమిటో ప్రజలకు తెలియదా? అని అన్నారు విడుదల రజని. వైయస్ జగన్ హయాంలో సంక్షేమం.. చంద్రబాబు హయాంలో వెన్నుపోటు-దోపిడీ తప్పా మరోటి లేదన్నారు.
