న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి టబుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. వ్యక్తిత్వ , ప్రచార హక్కుల రక్షణ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డీప్ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్, ఇతర డిజిటల్ సాంకేతికతల ద్వారా టబు పేరు, చిత్రం, స్వరం, ఫోటోగ్రాఫ్లు , ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనధికారికంగా ఉపయోగించకుండా రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞను జారీ చేసింది. నటి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ టబుకు సంబంధించిన అనధికారిక , అభ్యంతరకరమైన కంటెంట్ను కలిగి ఉన్న అనేక యుఆర్ఎల్ లను తొలగించాలని లేదా వాటికి యాక్సెస్ను నిలిపివేయాలని గూగుల్, మెటా, ఎక్స్ , రెడిట్ వంటి ప్రధాన డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఆదేశించారు. అలాగే, ఆయా ఖాతాలు లేదా కంటెంట్కు సంబంధించిన ప్రాథమిక చందాదారుల సమాచారం, ఐపీ లాగ్ వివరాలను వెల్లడించాలని కొన్ని ప్లాట్ఫారమ్లు , డొమైన్ సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది.
నకిలీ ఈవెంట్-బుకింగ్ ఖాతాలు, అనధికారిక వస్తువుల విక్రయం , కల్పిత ప్రకటనలు , ఏఐ ద్వారా సృష్టించబడిన లేదా మార్చబడిన అసభ్యకరమైన కంటెంట్ ద్వారా ఆన్లైన్లో తన గుర్తింపును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తున్నారని నటి ఆరోపించారు. ఎక్స్-పార్టే మధ్యంతర నిషేధాజ్ఞను మంజూరు చేయడానికి టబు ప్రాథమిక సాక్ష్యాధారాలతో కూడిన బలమైన వాదనను చూపించారని , పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉన్నాయని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. మధ్యంతర రక్షణ కల్పించకపోతే ఆమెకు పూడ్చలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిత్వ హక్కులను ఢిల్లీ హైకోర్టు గతంలోనే గుర్తించి, రక్షణ కల్పించిందని కోర్టు గుర్తుచేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఒక ప్రముఖ వ్యక్తి పేరు, చిత్రం లేదా ఇతర ప్రత్యేక లక్షణాలను అనధికారికంగా ఉపయోగించడం అనేది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది కోర్టు.
