హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రకటించిన విధంగా రుణ మాఫీని అమలు చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. రైతు అనుకూలమైన సాహసోపేత చర్యలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పంట కాలంలోనే ₹2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఒకే విడతలో మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల మొత్తం 25,35,964 మంది రైతులకు లబ్ధి చేకూరగా, ₹20,616.89 కోట్ల రుణ భారం మాఫీ చేశామన్నారు. .
ఈ నిర్ణయం దేశంలోనే ఒక కీలక మైలురాయి అని, రైతులకు అర్థవంతమైన ఆర్థిక ఉపశమనం కల్పించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇది చాటుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల మధ్య కూడా ఈ చర్యను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. పంట రుణ మాఫీ అమలు కోసం ప్రభుత్వం పారదర్శకమైన , క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించిందని మంత్రి వివరించారు. బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, 40 బ్యాంకుల నుండి అర్హత కలిగిన పంట రుణ ఖాతాల వివరాలను సేకరించారు.
బ్యాంకులు సమర్పించిన 42.30 లక్షల రుణ ఖాతాలలో, 31.07 లక్షల ఖాతాలను కుటుంబ ఖాతాలుగా గుర్తించామన్నారు. పరిశీలన అనంతరం అసలు, వడ్డీతో కలిపి ₹2 లక్షల వరకు బకాయి ఉన్న 25,35,964 పంట రుణ ఖాతాలు అర్హత కలిగినవిగా తేలాయన్నారు. తదనంతరం మొత్తం ₹20,616.89 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు వెల్లడించారు. ఈ మాఫీ కేవలం ₹2 లక్షల వరకు ఉన్న పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను ప్రత్యేకంగా పరిగణిస్తారని ఆయన స్పష్టం చేశారు. అమలు ప్రక్రియలో కొన్ని రుణ ఖాతాలలో లోపాలు లేదా వ్యత్యాసాలు గుర్తించామని మంత్రి తెలిపారు. అర్హులైన ఏ రైతు కూడా లబ్ధికి దూరం కాకూడదనే ఉద్దేశంతో, అధికారులు దాదాపు రెండు నెలల పాటు గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టారన్నారు. ఇందులో ఆధార్ అనుసంధానం, ఖాతా వివరాల సవరణ వంటి చర్యలు ఉన్నాయి.
