న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు రక్షణ కోసం కాదని కేవలం హోటళ్లు-క్యాసినోల కోసమేనని ఆరోపించచారు. గత ఏప్రిల్ చివరలో అండమాన్ , నికోబార్ దీవులలో తాను చేసిన పర్యటన ఆధారంగా రాహుల్ గాంధీ 16 నిమిషాలకు పైగా నిడివి గల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేట్ నికోబార్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు ప్రజల కోసం కానే కాదన్నారు. ఇది కేవలం మోదీ అనుకూలురైన వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
గ్రేట్ నికోబార్ దీవి ప్రాజెక్ట్ రక్షణ , సరుకు రవాణా కేంద్రం కోసం ఉద్దేశించిందని మోదీ ప్రభుత్వం చెబుతున్న వాదన పూర్తిగా అబద్దమన్నారు. భారతదేశపు అత్యంత విలువైన, తిరిగి పొందలేని పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన భూమిపై ఒక వ్యాపారవేత్తకు హోటళ్లు , క్యాసినోలను నిర్మించడానికి సహాయ పడటమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. నేను ఇందిరా పాయింట్ వద్ద నిలబడ్డాను. శతాబ్దాలుగా నిలిచి ఉన్న చెట్ల కింద నడిచాను. భూమిపై అత్యంత వైవిధ్య భరితమైన పగడపు దిబ్బల మధ్య నీటిలోకి దిగాను. అక్కడ నివసిస్తున్న ప్రజలతో కూర్చున్నాను. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి వారి భూమిని లాగేసుకుంటున్న గిరిజన వర్గాల గోడు విన్నానని అన్నారు రాహుల్ గాంధీ.
