తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్త బాంధవులకు తీపి కబురు చెప్పింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి, కాలి నడక బాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమ జ్జయంతి నాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించ బడుతుంది.
ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున హనుమ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు తరలి రానున్నారు.
