ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం

భక్తి రసామృతంలో మునిగిన తిరుపతి

తిరుపతి : వేంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. “బ్రహ్మకడిగిన పాదము…”, “కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు…”, “నారాయణ తే నమో నమో…”, “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన…”, “హరి అవతారమితడు అన్నమయ్య…” వంటి కీర్తనలు ఆలపించగా సభా వేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండి పోయింది. అనంతరం హారతి, మహా నివేదనం నిర్వహించారు.

సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా తిరుపతికి చెందిన అన్నపూర్ణ బృందం సంగీత సభ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి విజయలక్ష్మీ బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకోనున్నాయి. మహతి కళాక్షేత్రంలో సాయంత్రం గాత్ర సంగీతం, అనంతరం నృత్య కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. తిరుపతికి చెందిన కుమారి వేదవ్యాస రంగ రాజశ్రీ బృందం సంగీత సభ, శ్రీమతి ధనశ్రీ శ్రీనివాస్ బృందం నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు .ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు డా. లత, కళాకారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!