ఏపీ, తెలంగాణ : అటు ఏపీలో ఇటు తెలంగాణ రాష్ట్రాలను వడ గాల్పులు వెంటాడుతున్నాయి. ఎండ దెబ్బకు జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ). ఏపీ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు ఎండీ ప్రకర్ జైన్. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40- ఏపీ42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.
ఈనెల 8న సోమవారం కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఎండీ ప్రఖర్ జైన్. ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.9, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 43.4, అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి జిల్లా ఓజిలిలో 43.2, మన్యం జిల్లా నవగాంలో 43.1, బాపట్ల జిల్లా కారంచేడు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 43డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయిందని తెలిపారు . ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని కోరారు.
