Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు. కాగా, ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఈ కుంకీ ఏనుగుల కేంద్రం ఏర్పాటు చేశారు. నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన సంగతి తెలిసిందే. అటవీ ఏనుగులు జనావాసాలు, పంటపొలాల్లో పడి నాశనం చేయకుండా ఈ కుంకీ ఏనుగులు అడ్డుకుంటాయి. దీని కోసమే ప్రత్యేకంగా వాటిని ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఉపముఖ్యమంత్రి పవన్. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచారు అటవీ శాఖ అధికారులు. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరీంగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైడ్ లైఫ్ అని అర్థం. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అటవీ శాఖకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో హనుమాన్పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని హుకుం జారీ చేశారు.
జనసేన పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు !
జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం సాయంత్రం ఈ ఎక్స్ ఖాతా హ్యాక్ చేసినట్లు పార్టీ కార్యాలయంలోని సిబ్బంది గుర్తించారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వ్యవహారంలో.. నాయకులను పార్టీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఈ అకౌంట్లో అనుమానాస్పద పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.
ఈ ఖాతా హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ పిక్చర్తోపాటు కవర్ ఫొటోను సైబర్ నేరగాళ్లు తొలగించారు. అలాగే పార్టీకి సంబంధం లేని ఫొటోలు సైతం ఈ ఖాతాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే గతంలో ఈ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుల మాత్రం యాథావిథిగా ఉన్నాయి. కానీ దీనిపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయ లేదు.
మరోవైపు జనసేన పార్టీ ఎక్స్ ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాకింగ్కు గురైంది. ఆ తర్వాత జనసేన యూట్యూబ్ ఛానెల్ను యథాస్థితికి తీసుకొచ్చారు.
