PM Narendra Modi Launches New Scheme: అయోధ్య రాముని ఆశీస్సులతో కొత్త పథకం ప్రకటించిన ప్రధాని మోదీ

అయోధ్య రాముని ఆశీస్సులతో కొత్త పథకం ప్రకటించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: అయోధ్య రామమందిరంలో బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుండి ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’అనే సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ‘ప్రధానమంత్రి(PM Narendra Modi) సూర్యోదయ యోజన’ పథకం క్రింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్న వెంటనే ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం తన అధికారిక సోషల్ మీడియా (ఎక్స్‌) వేదికగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మోదీ ప్రకటించారు.

PM Narendra Modi – ప్రధాని మోదీ ట్వీట్ లో ఏమన్నారంటే ?

‘‘సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారు. ఈ రోజు అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా పయనించేందుకు దోహదం చేస్తుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : AP Anganwadis : జులై నుంచి జీతాల పెంపు..మిగతా 10 డిమాండ్లు తక్షణమే అన్న బొత్స

Leave A Reply

Your Email Id will not be published!