అమరావతి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థ నాయకత్వంతోనే సమస్యలను పరిష్కరించ గలమని అన్నారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. లీడర్షిప్ కాంక్లేవ్ను తొలిసారిగా నిర్వహిస్తున్నాం అన్నారు. నాయకత్వం అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు . తాను ఎన్నో సమస్యలను పరిష్కరించానని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. కానీ నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే నాకు అత్యంత సంతృప్తినిస్తుందని అన్నారు సీఎం. నాయకులుగా ఎదగాలంటే చాలా ఓపిక ఉండాలన్నారు. ప్రధానంఆ సమాచారాన్ని తెలుసు కూడా ముఖ్యమన్నారు. వర్తమానాన్ని అర్థం చేసుకోవాలని, ఇదే క్రమంలో భవిష్యత్తును అంచనా వేయాలని అన్నారు.
చెడు గురించి చెబితేనే మంచి అంటే ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు సీఎం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పెట్టిందని, ఇదే క్రమంలో వ్యవస్థలను విధ్వంసం చేసిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్తో కలిసి కూటమి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎప్పుడూ దక్కని విజయాన్ని ప్రజలు కూటమికి కట్టబెట్టారని అన్నారు. పాలకుడు ఏ విధంగా ఉండకూడదో అనే దానికి గత పాలకుడైన జగన్ మోహన్ రెడ్డి ఓ కేస్ స్టడీగా చూడొచ్చంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారంతో ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పని చేస్తున్నాం అని చెప్పారు. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ పాలన చేపట్టాం అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 రూపకల్పన చేసుకున్నాం. జిల్లా, నియోజకవర్గాలకూ విజన్ ప్లాన్ ఇచ్చామని పేర్కొన్నారు. నెలకు నాలుగు రోజులు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
పేదల సేవలో, మీ భూమి-మీ హక్కు, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, సంజీవని కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నామన్నారు. విద్య-వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు గుడ్ బై చెప్పి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర ఫించన్ ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ల, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, దీపం, మత్య్సకారుల సేవలో వంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం.
