న్యూఢిల్లీ : ఆర్డీటీ సంస్థకు లైన్ క్లియర్ చేసినందుకు కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ (RDT) ఎదుర్కొంటున్న FCRA సంబంధిత సమస్యల పరిష్కారంలో సకాలంలో జోక్యం చేసుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్సీఆర్ఏను పునరుద్దరించడం పట్ల సంతోషంగా ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. దీనివల్ల ఆ సంస్థ ప్రజలకు అందిస్తున్న అమూల్యమైన సేవలను నిరంతరాయంగా కొనసాగించే అవకాశం లభించిందన్నారు. దశాబ్దాలుగా, విద్య, వైద్యం, ఆర్థిక సాధికారత రంగాలలో తన ప్రభావవంతమైన సేవల ద్వారా ఆర్డీటీ గుర్తింపు పొందిందని తెలిపారు. అనంతపురం ప్రాంత ప్రజలకు ఒక విస్తృత కుటుంబంలా సేవలు అందిస్తోందని కొనియాడారు.
ఈ సానుకూల ఫలితం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం లోనూ, ఐటీ , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యం లోనూ జరిగిన నిరంతర కృషికి నిదర్శనం అని అన్నారు. అంతేకాకుండా, పీజీ పేట, కళింగపట్నం గ్రామాల వద్ద నాగావళి, వంశధార నదుల ముఖద్వారాల సమీపంలో తీవ్రమైన తీర కోత సమస్యను అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమస్యపై తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు, అలాగే కోత తీవ్రత పెరగకుండా నిరోధించడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేసేందుకు ‘జాతీయ విపత్తు ఉపశమన నిధి’ (NDMF) నుండి సహకారం అందించాలని విన్నవించారు.
